Deputy CM Pawan: సాగులో వైవిధ్యమే భూమికి రక్ష
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:22 AM
భూమిని రక్షించుకుంటూ, రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలి. విభిన్న జాతుల మొక్కలతో పండ్ల తోటలను సాగు చేయడం ద్వారా భూసారాన్ని, వాతావరణాన్ని రక్షించుకోవచ్చు’ అని...
విభిన్న రకాల పంటలను ప్రోత్సహించాలి: డిప్యూటీ సీఎం
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘భూమిని రక్షించుకుంటూ, రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలి. విభిన్న జాతుల మొక్కలతో పండ్ల తోటలను సాగు చేయడం ద్వారా భూసారాన్ని, వాతావరణాన్ని రక్షించుకోవచ్చు’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, 50ు గ్రీన్ కవర్ ప్రాజెక్టుల టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. గ్రీన్ కవర్లో ఉద్యాన శాఖ పాత్ర, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ‘2047నాటికి రాష్ట్రంలో 50ు గ్రీన్ కవర్ సాధించే అంశాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. ఇందుకోసం అన్ని శాఖలు అటవీ శాఖతో సమన్వయం కావాలి. గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ కీలక పాత్ర పోషించాలి. రైతులకు, భూమికి ఉపయోగపడేలా ఉద్యానపంటల సాగులో వైవిధ్యం తీసుకురావాలి. ఒకే పంటలో వివిధ జాతుల మొక్కలను పెంచాలి. అంతర పంటలను ప్రోత్సహించాలి. సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి. దీనివల్ల భూమికి చేవ పెరుగుతుంది. జీవ వైవిధ్యాన్నీ రక్షించుకోవచ్చు’ అని పేర్కొన్నారు.