కోస్తాలో దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:06 AM
కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శనివారం దట్టంగా పొగమంచు కురిసింది.
100 మీటర్లకు పడిపోయిన విజిబిలిటీ
విశాఖపట్నం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శనివారం దట్టంగా పొగమంచు కురిసింది. ప్రధానంగా మధ్య కోస్తా జిల్లాల్లో విజిబిలిటీ 100 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్టులో విజిబిలిటీ 500 మీటర్లుగా నమోదైంది. అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా, గాలులు నిశ్చలంగా ఉండటంతో పొగమంచు కురిసింది. మరో వారం రోజులు పొగమంచు కురుస్తుందని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథకుమార్ తెలిపారు. పగటిపూట ఎండ స్వల్పంగా పెరుగుతుందని, రాత్రి సమయంలో చలి తీవ్రత కొనసాగుతుందని వివరించారు. శనివారం రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయన్నారు. ఆరోగ్యవరంలో 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.