నేడు పోలవరానికి సీఎస్ఎంఆర్ఎస్ శాస్త్రవేత్తలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:06 AM
పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రం వాల్ పూర్తయి.. దానిపై ఎర్త్ కమ్ రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం నిర్మాణ పనులు చేపడుతున్న దశలో..
అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రం వాల్ పూర్తయి.. దానిపై ఎర్త్ కమ్ రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం నిర్మాణ పనులు చేపడుతున్న దశలో.. పుణేకు చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్)కు చెందిన ఆరుగురు శాస్త్రవేత్తల బృందం సోమవారం ప్రాజెక్టును సందర్శించనుంది. సీఎస్ఎంఆర్ఎస్ డైరెక్టర్ చిత్ర నేతృత్వంలో మనీశ్ గుప్తా, హరీంద్ర ప్రకాశ్, సత్యజిత్రాయ్, ఎస్.హెచ్ ఉదయభాను, హేమంత్కుమార్ జోషితో కూడిన బృందం సోమ, మంగళవారాల్లో అక్కడ పర్యటిస్తుంది. ఈసీఆర్ఎఫ్ డ్యాం కోసం వాడనున్న మట్టి, రాళ్ల నాణ్యతను పరిశీలిస్తుంది. వాడాల్సిన మెటీరియల్పై కాంట్రాక్టు సంస్థతో పాటు ప్రాజెక్టు అధికారులకు అవగాహన కల్పిస్తుంది. మట్టి, రాళ్లలోని గట్టితనం గుర్తించడంపై పోలవరం ఇంజనీరింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. కీలకమైన ఈసీఆర్ఎఫ్ నిర్మాణ సమయంలోనే పనుల్లో లోపాలు తలెత్తకుండా శాస్త్రవేత్తలు ముందస్తు జాగ్రత్తలు చెప్పే వీలుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు.