పాఠ్యపుస్తకాల లీకుపై క్రిమినల్ కేసు!
ABN , Publish Date - Mar 25 , 2026 | 06:08 AM
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల కంటెంట్ లీకు వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనికి బాధ్యులుగా అనుమానిస్తున్న వీజీఎస్ పబ్లిషర్స్పై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించినట్లు తెలిసింది.
‘వీజీఎస్’పై నమోదుకు ప్రభుత్వ ఆదేశం
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల కంటెంట్ లీకు వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనికి బాధ్యులుగా అనుమానిస్తున్న వీజీఎస్ పబ్లిషర్స్పై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి, తెలుగు అకాడమీ ఇన్చార్జి డైరెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం ప్రింటర్లు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పాఠ్యపుస్తకాల కంటెంట్ను లీక్ చేసిన పబ్లిషర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రింటర్లు కోరారు. గతంలో పాటించిన ‘కంటెంట్ ప్రొటెక్షన్’ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. లీకు వ్యవహారంపై ఇంటర్ బోర్డు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 120 మంది టీచర్లు 11 నెలల పాటు కష్టపడి తయారు చేసిన పాఠ్యపుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా వాట్సా్పలో సర్క్యులేట్ చేయడంతో శ్రమ వృథా అయినట్లుగా భావిస్తోంది. కాగా, దాదాపు రూ.22 కోట్ల విలువైన ఈ టెండరు ఖరారులోనే చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. తొలిసారిగా నాలుగు ప్రింటింగ్ యంత్రాలు ఉంటేనే అర్హులనే నిబంధన పెట్టడం ద్వారా కొద్దిమంది మాత్రమే అర్హత సాధించారు. విద్యా శాఖలో కొందరు ఉన్నతాధికారులు కొందరు ప్రింటర్లకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా కంటెంట్ లీకు వ్యవహారంలోనూ కొందరు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై టెండర్ల నిబంధనల నుంచీ విచారణ చేయాలని ప్రింటర్లు డిమాండ్ చేస్తున్నారు.