అమరావతికి తొలి నుంచీ మద్దతుగా నిలిచాం: సీపీఐ నారాయణ
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:47 AM
రాష్ట్రం విడిపోయిన తర్వాత గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని ఉండాలని తొలుత తీర్మానం చేసింది సీపీఐ. మనసా వాచా కర్మణా రాజధాని కోసం...
తాడేపల్లి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని ఉండాలని తొలుత తీర్మానం చేసింది సీపీఐ. మనసా వాచా కర్మణా రాజధాని కోసం అంకితభావంతో పని చేసిన పార్టీ సీపీఐ. అమరావతికి మేమెప్పుడూ మద్దతుగానే నిలిచాం’ అని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా పెనుమాకలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మొదట్లో 30 వేల ఎకరాల ప్రణాళిక చెప్పినప్పుడు నాలుగైదు వేల ఎకరాలు తీసుకుని రాజధానిని చాలా బాగా కట్టుకోవచ్చని నేనే స్టేట్మెంట్ ఇచ్చానని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట పెట్టకుండా ఐదు వేల ఎకరాలు తీసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని కడితే దాని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని, అప్పుడు డిమాండ్ పెరిగి భూములు కొనుగోలు చేస్తారని చెప్పారు. ప్రారంభించిన నాటి నుంచి రాజధాని పనులు అనుకున్నట్టు జరిగితే.. ఈపాటికి రాజధాని కళకళలాడేది అని నారాయణ వ్యాఖ్యానించారు.