నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కరోనా కేసులు
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:50 AM
రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది.
నెల్లూరు (వైద్యం)/విజయవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంకు చెందిన బాలుడికి క్యాన్సర్ చికిత్స కోసం కుటుంబసభ్యులు ఈ నెల 13న పుదుచ్చేరికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు శనివారం బాలుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఈ సమాచారంతో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. బాలుడితోపాటు ఉన్న తల్లిదండ్రులతోపాటు నిడిగుంటపాళెంలోని సమీప బంధువులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలుపడికి చెందిన 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్య ఉండటంతో విజయవాడ జీజీహెచ్లో డయాలసిస్ చేయిస్తున్నారు. గురువారం ఆ బాలిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండటంతో వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో పాజిటివ్ రావడంతో వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు.