పాత పద్ధతిలోనే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:39 AM
కాంట్రాక్టు ఉద్యోగులకు పాత పద్ధతిలోనే ఫిబ్రవరి నెల జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్చి వేతనాలు మాత్రం ‘నిధి పోర్టల్’ ద్వారానే
జిల్లా అధికారులకు ట్రెజరీ శాఖ ఆదేశాలు
ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం
గుంటూరు సిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగులకు పాత పద్ధతిలోనే ఫిబ్రవరి నెల జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. వివిధ శాఖల అధికారులు నిధి పోర్టల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యక్తిగత, నియామక, క్యాడర్ స్ట్రెంగ్త్ తదితర వివరాల నమోదును పూర్తి చేయకపోవడంతో జీతాల చెల్లింపు నిలిచిపోయింది. దీనిపై వరుస పండుగల వేళ జీతాలు రాక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ ఈనెల 15న.. ‘పండుగ వేళ పస్తులే!’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. నిధి పోర్టల్ ద్వారా ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగినట్లు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి జీతాలను సాధారణ విధానం (సీఎ్ఫఎంఎస్) ద్వారానే చెల్లించాలని నిర్ణయించారు. అదే సమయంలో మార్చి నెల జీతాలను మాత్రం తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారానే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పండగ వేళ తాత్కాలిక ఊరట లభించింది.