మాలకొండలో అవకతవకలపై విచారణకు కమిటీ
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:03 AM
వలేటివారిపాలెం మండ లంలోని మాలకొండ దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పలు అవకతవకలు, దేవస్థాన ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చోటుచేసు కున్న కొన్ని ఘటనలపై సమగ్ర విచారణకు దేవదాయ శాఖ కమిష నర్ ఆదేశించారు.
దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు
కందుకూరు, ఏప్రిల్ 22 (ఆంరఽధజ్యోతి) : వలేటివారిపాలెం మండ లంలోని మాలకొండ దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పలు అవకతవకలు, దేవస్థాన ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చోటుచేసు కున్న కొన్ని ఘటనలపై సమగ్ర విచారణకు దేవదాయ శాఖ కమిష నర్ ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చారు. త్వరలో ఆ కమిటీ విచారణ చేపట్టనుంది. గతంలో మాలకొండలో ఈవోగా పనిచేసి ప్రస్తుతం గుంటూరు రీజియన్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న కేబీ శ్రీనివాసరావు, కర్నూలు డీసీలను విచారణకు నియమించినట్లు సమాచారం. ప్రధానంగా గతేడాది తలనీలాలు పాట పాడిన వ్యక్తి కోటి రూపాయలకు పైగా దేవస్థానానికి ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కూడా అదే వ్యక్తి మరో పేరుతో తలనీలాలు దక్కించుకోవడంలో స్థానిక అధికారులు లోపాయికారీ సహకారం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని పాటలు పాడిన వారు కూడా పాట మొత్తం చెల్లించకుండా ఈ ఏడాది కూడా మరో పేరుతో కొనసాగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆలయ ఈవో దేవస్థానం సంప్రదాయాలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తున్నారన్న ఆందోళనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండపైన ఈవో జన్మదిన వేడుకలు జరుపుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇతరత్రా పలు అవకతవకలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వీటన్నింటిపై సమగ్ర విచారణ కోసం కమిటీని నియమించినట్లు సమాచారం.