Share News

అహ్మద్‌బాబును తొలగించాలి

ABN , Publish Date - May 03 , 2026 | 05:42 AM

అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రధాన కమిషనర్‌ అహ్మద్‌బాబును తొలగించి మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని సీసీఎస్టీగా నియమించాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

అహ్మద్‌బాబును తొలగించాలి

  • మరో సీనియర్‌ ఐఏఎస్‌ను సీసీఎస్టీగా నియమించాలి

  • ‘మాకొద్దు ఈ బాబు’ అంటూ నాలుగో రోజూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నిరసన

  • ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిక

అమరావతి/విజయవాడ, మే 2 (ఆంధ్రజ్యోతి): అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రధాన కమిషనర్‌ అహ్మద్‌బాబును తొలగించి మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని సీసీఎస్టీగా నియమించాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ‘అయ్యా బాబు గారు.. మాకొద్దు ఈ బాబు’ అంటూ అహ్మద్‌బాబుకు వ్యతిరేకంగా నాలుగో రోజు శనివారం నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో నాలుగో తరగతి ఉద్యోగులు నిరసన కొనసాగించారు. ఇంత జరుగుతున్నా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సంబంధిత శాఖ మంత్రి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నాయకులు విమర్శించారు. తమ శాఖకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవాలని కోరారు. హైకోర్టు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి అహ్మద్‌బాబు చేపట్టిన ప్రతీకార చర్యలన్నింటినీ రద్దు చేయాలని, ఆయనపై తక్షణమే విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో గత కొంత కాలంగా జరుగుతున్న అవినీతి వ్యవహారాలను ఆధారాలతో సహా విచారణాధికారి ముందు ఉంచడానికి తమ సంఘం సిద్ధంగా ఉందని తెలిపారు. అహ్మద్‌బాబు చేపడుతున్న అక్రమ బదిలీలు, క్రమశిక్షణ చర్యల పేరుతో విధిస్తున్న శిక్షలు, పెడుతున్న తప్పుడు కేసులు... ఇవేవీ న్యాయ సమీక్షకు నిలవవని స్పష్టం చేశారు. కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాల సహకారంతో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టుకుని ఉద్యమ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 5, 6 తేదీల్లో సంఘ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీసీటీవోఎస్ఈఏ చైర్మన్‌ బాపట్ల గోపాలకృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శ్రీనివాసరావు, జి.ఎం.రమేశ్‌ కుమార్‌ తెలిపారు.


అహ్మద్‌బాబుపై విమర్శలు బాధాకరం: నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌

వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌బాబుపై అనవసరపు విమర్శలు చేయటం విచారకరమని, వీటిని తమ సంఘం ఖండిస్తోందని వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ పేర్కొంది. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్‌రావు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు పారదర్శకంగా జరిగాయని, ఈ విషయంలో అహ్మద్‌బాబు సహకరించారని, ఉద్యోగుల్లో మనోధైర్యం నింపారని తెలిపారు. దీనివల్ల కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకు అడ్డుకట్ట పడిందన్నారు. చీఫ్‌ కమిషనర్‌పై విమర్శలు చేయటం విచారకరమన్నారు. అహ్మద్‌బాబు మార్గదర్శకత్వంలో ఏప్రిల్‌లో ఆదాయం పెరిగిందన్నారు.

Updated Date - May 03 , 2026 | 05:42 AM