1, 2 తేదీల్లో తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:23 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన ఖరారయింది. జూలై 1, 2 తేదీల్లో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
హీరో మోటార్స్ విస్తరణ ప్లాంటుకు శంకుస్థాపన
వీబీ జీ రామ్ జీ పథకం జాతీయ స్థాయిలో ప్రారంభం
పాల్గొననున్న కేంద్ర మంత్రి చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్
తిరుపతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన ఖరారయింది. జూలై 1, 2 తేదీల్లో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటి రోజు సత్యవేడు మండలం మాదనపాలెంలోని హీరో మోటర్స్ పరిశ్రమ విస్తరణ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు రాత్రి శ్రీసిటీ సెజ్లో బస చేసి మరుసటి రోజు, 2వ తేదీ రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేశ్ పాశ్వాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లతో కలసి పర్యటిస్తారు. వీబీ జీ రామ్ జీ పథకాన్ని జాతీయ స్థాయిలో ఇక్కడే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేపట్టింది.
1, 2 తేదీల్లో మంత్రి లోకేశ్ పర్యటన
కాగా మంత్రి లోకేశ్ కూడా జూలై 1, 2 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 1వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట మండలం ఎలమండెం పంచాయతీ కొత్తపాలెం వద్ద టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు. రాత్రికి తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచీ శ్రీసిటీ చేరుకుని ప్రతిష్ఠాత్మక శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.