AP Land Issues: భూ వ్యధలు తీర్చేదెలా?
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:35 AM
రాష్ట్రంలో పాస్పుస్తకాల సమస్యలు, భూ వ్యధలు, రీసర్వేపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం ఉదయం మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
నేడు మంత్రులు, అధికారులతో సీఎం భేటీ
రీసర్వే, పాస్పుస్తకాల పంపిణీపై చర్చ
కేంద్ర నిధుల ఖర్చు, పీపీపీ ప్రాజెక్టులపైనా..
వర్చువల్గా పాల్గొననున్న కలెక్టర్లు
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాస్పుస్తకాల సమస్యలు, భూ వ్యధలు, రీసర్వేపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం ఉదయం మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ సమస్యలపై లోతుగా చర్చిస్తారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో పర్యటించిన ఆయన.. క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. వీటన్నిటినీ పరిష్కరించేందుకు ఏం చేయాలో అధికారులతో చర్చించేందుకే ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. కేంద్ర పథకాల నిధుల వ్యయం, పీపీపీ ప్రాజెక్టులు.. ప్రజల్లో సంతృప్త స్థాయి ఏ మేరకు పెరిగిందో చర్చించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరిగే ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు వర్చువల్ విధానంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల నిమిత్తం రాష్ట్రానికి అందించిన నిధులపై గతంలో కార్యదర్శుల సదస్సు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చర్చించారు. కేంద్ర నిధులు మురిగిపోతున్నాయని, సమయానికి ఖర్చుచేయకపోవడం వల్ల వెనక్కి వెళ్లిపోతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు. దీంతో సెక్రటరీలు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లు జనవరి 15 నాటికి కేంద్రం నిధులు మొత్తం ఖర్చు చేయాలని.. మూడో క్వార్టర్కు సంబంధించి అదనపు నిధులు కేంద్రం నుంచి రాబట్టాలని ఆయన డెడ్లైన్ విధించారు. ఈ అంశంపై సోమవారం మళ్లీ సమీక్షిస్తారు.