CM Chandrababu Naidu: జీ రామ్ జీ తో ఆస్తుల సృష్టి
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:21 AM
గ్రామీణ పేదలకు 25రోజుల పని అదనంగా కల్పించడంతో పాటు పల్లెల్లో శాశ్వత ఆస్తులు సృష్టించడమే లక్ష్యంగా కేంద్రం ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ పథకాన్ని తీర్చిదిద్దిందని...
25 రోజులు అదనంగా ఉపాధి: చంద్రబాబు
నీటి భద్రత, గ్రామాల్లో వసతులు: మంత్రి దుర్గేశ్
అవినీతికి చెక్.. పేదలకు పని: బీజేపీ చీఫ్ మాధవ్
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదలకు 25రోజుల పని అదనంగా కల్పించడంతో పాటు పల్లెల్లో శాశ్వత ఆస్తులు సృష్టించడమే లక్ష్యంగా కేంద్రం ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ పథకాన్ని తీర్చిదిద్దిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పథకంపై అపోహలు తొలగించడంతో పాటు ఉపయోగాలపై రాష్ట్ర ప్రజలకు కూటమి తరఫున వివరించే ప్రణాళికపై బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన తరఫున మంత్రి కందుల దుర్గేశ్ సీఎంతో క్యాంపు కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే కొత్త మార్గదర్శకాల ద్వారా పేదలకు 25రోజలు పాటు అదనంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఆస్తులు సృష్టించాలన్న పథకం లక్ష్యం నెరవేరాలన్నారు. మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ.. 2014-19మధ్య నరేగా నిధులతో సీఎం చంద్రబాబు గ్రామాల్లో ఆస్తులు సృష్టించారని, తాజా పథకం ద్వారా చెక్ డ్యామ్లు నిర్మించి నీటి భద్రత, ప్రజల అవసరాల కోసం మౌలిక వసతులు, గ్రామీణ పేదలకు జీవనోపాధి మరింత అధికంగా కల్పించవచ్చని తెలిపారు. జీ రామ్ జీలో బయోమెట్రిక్, జియో రెఫరెన్స్ అండ్ స్పేషియల్ టెక్నాలజీ పర్యవేక్షణ వల్ల అవినీతి ఆస్కారం ఉండబోదని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.