నేడు కలిదిండికి చంద్రబాబు
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:09 AM
సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కలిదిండి గ్రామానికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే రెవెన్యూ గ్రామసభకు ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్..
అమరావతి/ఏలూరు/కలిదిండి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కలిదిండి గ్రామానికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే రెవెన్యూ గ్రామసభకు ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి, ఇతర అధికారులు హాజరుకానున్నారు. నిషేధ విముక్తి పొందిన అసైన్డ్, మాజీ సైనికుల భూములపై పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించనున్నారు. తొలుత తహశీల్దార్ కార్యాలయంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాత పోస్టాఫీస్ వద్ద ప్రజావేదిక సభలో మాట్లాడతారు. భూ హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానిక ఏఎంసీ ఆవరణలో పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. గ్రామసభ నిర్వహణ కోసం సీసీఎల్ఏ, అదనపు సీసీఎల్ఏ వెంకటమురళి, రెవెన్యూ, సర్వే కీలక అధికారులు ఆదివారమే కలిదిండి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మోక్షం కలిగించిన సీఎం చంద్రబాబు, మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ సెక్రటరీ సాయిప్రసాద్ చిత్రపటాలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రైతులు, కూటమి నాయకులు కలిదిండి సెంటర్లో ఆదివారం క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి రైతులకు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు.