‘ఆత్మనిర్భర్’లో ఏపీ ముఖ్యపాత్ర
ABN , Publish Date - May 16 , 2026 | 06:17 AM
‘అడ్వాన్డ్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు రావడం ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి మారనుందని చెప్పారు.
పుట్టపర్తి ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగానూ మారనుంది: చంద్రబాబు
‘అడ్వాన్డ్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు రావడం ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి మారనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. దీనిని రాష్ట్రానికి కేటాయించినందుకు రాజ్నాథ్సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది రూ.15వేల కోట్లకుపైగా పెట్టుబడితో, 7500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుంది. అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి రక్షణ శాఖ, కేంద్రం సహకారం అందించాయి. జెట్ స్పీడ్తో అనుమతులిచ్చాం. 36 రోజుల్లోనే శంకుస్థాపన చేశాం. ఏరోస్పేస్ రంగంలో ఒ కీలక ప్రాజెక్టుతో పాటు మరికొన్ని డిఫెన్సు ప్రాజెక్టులు కూడా ఇక్కడకు వస్తాయి’ అని తెలిపారు. కర్నూలు (ఓర్లకల్లు) డ్రోన్ సిటీలో శంకుస్థాపనలు చేయడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం యుద్ధాల్లో డ్రోన్లే కీలకంగా మారాయని గుర్తుచేశారు. శ్రీహరికోట అంతరిక్షశక్తి, నాగాయలంకలో క్షిపణి శక్తి, పుట్టపర్తిలో రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తితో ఏపీ దేశానికి అండగా నిలుస్తోందన్నారు.
కరువుసీమలో పరిస్థితులు మార్చాం..
‘గతంలో రాయలసీమ రతనాల సీమ.. కానీ వివిధ కారణాలతో కరువుసీమగా మారిపోయింది.. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పరిస్థితిని మార్చాం’ అని సీఎం తెలిపారు. రాయలసీమలో ప్రతి ఎకరానికీ నీరిచ్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. ‘ఇక్కడి ఇనుపఖనిజం, సున్నపు రాయి తదితరసహజ వనరులను సమర్థంగా వినియోగించుకుంటాం. కడప స్టీల్ ప్లాంటు పనులను జూన్లో ప్రారంభిస్తాం. 2027 డిసెంబరునాటికి పూర్తి చేస్తాం. స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలకా్ట్రనిక్స్ తదితర పరిశ్రమలతో రతనాల సీమగా మారుస్తాం. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. ‘గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎ్ఫ-జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలులో వస్తోంది. జేజీఎఫ్ లో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకంగా మారుతుంది’ అని చెప్పారు.
గత పాలనంతా విధ్వంసమే..
గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చంద్రబాబు విమర్శించారు. ‘సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించాం. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. తద్వారా 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఇక్కడే ఉద్యోగాలు రావాలి. ఇతరులకూ మనమే ఉపాధి కల్పించేలా పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ తదితర ప్రాజెక్టులు వచ్చాయి. రిలయన్స్, బీపీసీఎల్ మొదలైనవి కూడా వస్తాయి. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మూడు ఎకనామిక్ రీజియన్లలో పెట్టుబడులు వస్తాయి. చిప్ నుంచి షిప్ వరకూ మన దేశంలోనే తయారు కావాలని ప్రధాని పిలుపిచ్చారు. ఏపీలో డిజైన్ చేయండి.. పెట్టుబడులు పెట్టండి.. తయారు చేయాలని నేను కోరుతున్నాను’ అని తెలిపారు.
ప్రధాని సూచనలు మనమూ ఆచరిద్దాం..
‘పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై కూడా పడింది. ఇంధనం, బంగారం కొనుగోలుతో విదేశీ మారకనిల్వలు తరిగి పోతున్నాయి. నాదేశం-నా బాధ్యత’పై అందరం దృష్టి పెట్టాలి. ప్రధాని ప్రతిపాదించిన వర్క్ ఫ్రం హోం తదితర ఏడు అంశాలను మనం కూడా ఆచరిద్దాం. మోదీ పిలుపిచ్చిన పొదుపు ఉద్యమానికి మన రాష్ట్రం సారథ్యం వహించాలి’ అని సీఎం పిలుపిచ్చారు.