రాజధానిలో వేగంగా బ్యాంక్స్ట్రీట్ పనులు’
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:26 AM
అమరావతిలో బ్యాంక్స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది.
సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): అమరావతిలో బ్యాంక్స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వివిధ బ్యాంకు ప్రధాన కార్యాలయాల నిర్మాణాలపై చర్చించారు. అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని, సీఆర్డీఏ నుంచి పూర్తిసహకారం అందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బ్యాంక్స్ట్రీట్లో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చిన 13 బ్యాంకుల్లో 11 తమ కార్యాలయాల నిర్మాణ బాధ్యతలను సీపీడబ్ల్యూడీకు అప్పగించాయని అధికారులు తెలిపారు. పూర్తిసమన్వయంతో త్వరితగతిన ఈ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని సీఎం సూచించారు. రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ కనెక్టివిటీలకు సంబంధించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని, పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అమరావతిని నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా.. నివాస వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్డ్ గ్యాస్ కనెక్షన్తో పాటు ఇండక్షన్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చెప్పారు. రాజధాని ప్రాంతంలో సుందరీకరణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.