Nara Lokesh: చంద్రబాబే మన నాయకుడు
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:03 AM
‘వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాయాలన్నదే లక్ష్యం. టీడీపీలో ఉండే ప్రతి ఒక్కరికీ ఆ లక్ష్యమే అజెండా కావాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
మళ్లీ గెలిచి చరిత్ర సృష్టిద్దాం
పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో లోకేశ్
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాయాలన్నదే లక్ష్యం. టీడీపీలో ఉండే ప్రతి ఒక్కరికీ ఆ లక్ష్యమే అజెండా కావాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఇటీవల కొత్తగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, కార్యదర్శు, జోనల్ కో-ఆర్డినేటర్లతో లోకేశ్ సుమారు 2 గంటలపాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ‘ మనందరికి చంద్రబాబు ఒక్కరే నాయకుడు, నాతోసహా మనమంతా పార్టీలో పనిచేసే సైనికులమే. సమస్యలు ఏమైనా ఉంటే బాధ్యత తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. అందరికీ నేను అందుబాటులో ఉంటా. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, మండల పార్టీ అధ్యక్షులతో క్యాలండర్ ప్రకారం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి’ అని మంత్రి పేర్కొన్నారు. ‘1999లో మాత్రమే మనం రెండోసారి గెలిచాం. ఆ చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. ఆయా నేతల పనితీరుపై మూడు నెలలకోసారి సమీక్షిస్తా. పనిచేయని వారిని మార్చడానికి వెనుకాడబోము. ఉత్తమ కార్యకర్తలకే నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశాం’ అని స్పష్టం చేశారు. ‘రాబోయే రోజుల్లో అందరం కలసి పార్టీని బలోపేతం చేద్దాం. చంద్రబాబు ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. టీడీపీకి కార్యకర్తే అధినేత’ అని లోకేశ్ అన్నారు.