పాలనలో సాంకేతికత వినియోగం
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:15 AM
పరిపాలనలో సాంకేతికతను వినియోగించడం ద్వారా ఉద్యోగులపై పనిభారం తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతస్థాయి అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు చర్యలు
కృత్రిమ మేధతో త్వరితగతిన సమస్యల పరిష్కారం
టెక్నాలజీ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్గా 2026
ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పరిపాలనలో సాంకేతికతను వినియోగించడం ద్వారా ఉద్యోగులపై పనిభారం తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతస్థాయి అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్టైమ్ గవర్నెన్స్పై సీఎం సమీక్షించారు. సాంకేతికతలో ఉద్యోగులకు సమర్థవంతమైన శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. శిక్షణ సమయంలో ఉద్యోగులు అందుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించాలన్నారు. టెక్నాలజీని అధికారులు, ఉద్యోగులు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని నిర్దేశించారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్గా చంద్రబాబు అభివర్ణించారు. కృత్రిమ మేధను వినియోగించడం ద్వారా ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్పై మరింత దృష్టి సారిస్తామని వెల్లడించారు. కాగా, మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ఇప్పటి వరకూ కోటీ43 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు.