డిజిటల్ క్లాస్ మాస్టారు!
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:49 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం డిజిటల్ క్లాస్ మాస్టారులా మారిపోయారు. క్లాస్రూంలో విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి..
తరగతి గదిలో విద్యార్థులకు సీఎం క్విజ్
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం డిజిటల్ క్లాస్ మాస్టారులా మారిపోయారు. క్లాస్రూంలో విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి.. వారి సమాధానాలను తన ఫోన్ ద్వారా డిజిటల్ స్ర్కీన్కు అనుసంధానించి, ఆయా సమాధానాలు సరైనవా కాదా అన్నవి చెబుతూ వారికి ర్యాంకింగ్ కూడా ఇచ్చారు. రంపచోడవరంలో మెగా పీటీఎం సందర్భంగా.. తొలుత పాఠశాల తరగతి గదులను, డిజిటల్ క్లాస్ రూమ్ల పనితీరును పరిశీలించారు. పాఠశాలల డిజిటలైజేషన్ మూలంగా ప్రపంచ విషయాలన్నీ విద్యార్థులకు బోధించే అవకాశం కలుగుతోందని.. ఆయా అంశాలను స్ర్కీన్పైనే చూపించి బోధించడం వల్ల వాటిపై విద్యార్థులకు పట్టు పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాగా, పోలవరం జిల్లా కలెక్టర్ సహా ముఖ్య అధికారులంతా తనను కలిసినప్పుడు రంపచోడవరం నియోజకవర్గ పరిస్థితిపై ఆరా తీశారు. కుప్పం నియోజకవర్గాన్ని కూడా లోతుగా సమీక్షించని తాను రంపచోడవరంలో అన్ని రంగాలనూ సమీక్షిస్తున్నానన్నారు. తలసరి ఆదాయంలో చివరిలో ఉన్న పోలవరం జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్కు దిశానిర్దేశం చేశారు.
- రంపచోడవరం, ఆంధ్రజ్యోతి