అర్ధరాత్రి యువకుల ఘర్షణ
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:50 PM
ఈనెల 22 వతేదీ పాణ్యం సమీపంలోని ఒక డాబా వద్ద జరిగిన యువకుల ఘర్షణలో రాష్ట్ర మంత్రి కుమారుడి కారు డ్రైవర్తో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంత్రి కుమారుని కారు డ్రైవర్కు, మరో యువకుడికి గాయాలు
ప్రథమ చికిత్స అనంతరం నంద్యాలకు తరలింపు
ఫిర్యాదు అందకపోవడంతో నమోదు కాని కేసు
పాణ్యం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) ఈనెల 22 వతేదీ పాణ్యం సమీపంలోని ఒక డాబా వద్ద జరిగిన యువకుల ఘర్షణలో రాష్ట్ర మంత్రి కుమారుడి కారు డ్రైవర్తో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి మంత్రి కుమారుడు, అధికార పార్టీ ప్రతినిఽధి కారు డ్రైవర్తోపాటు మరో కొందరు యువకులు కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్తూ పాణ్యం సమీపంలోని ఒక డాబా వద్ద భోజనానికి ఆగారు. ఆ సందర్భంలో కారు డ్రైవర్కు డాబా సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగి అది ఘర్షణగా మారింది. డాబా సిబ్బంది, మంత్రి కుమారుడి కారు డ్రైవర్తోపాటు వచ్చిన యువకులు పరస్పరం కొట్టుకున్నట్లు తెలిసింది. పాణ్యం హైవే పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణను నివారించినట్లు తెలిసింది. మంత్రి కుమారుడి కారు డ్రైవర్తోపాటు మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పాణ్యం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం నంద్యాల ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి మాట్లాడుతూ హోటల్ వద్ద జరిగిన ఘర్షణ వాస్తవమేనని దీనిపై ఫిర్యాదు అందలేదని, అందువల్ల కేసు నమోదు చేయలేదని అన్నారు.