ఈపూరుపాలెంలో దారుణ హత్య
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:49 AM
ఐటీఐ కళాశాల నిర్వహణ విషయమై కమిటీ సభ్యుల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐటీఐ కళాశాల నిర్వహణలో విభేదాలే కారణం
చీరాల, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఐటీఐ కళాశాల నిర్వహణ విషయమై కమిటీ సభ్యుల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. వేటపాలెం మండలం దేశాయిపేటకు చెందిన ఎస్ఏ సత్తార్.. ఎస్కేబీఎం ఐటీఐ కళాశాల ఏర్పాటు చేశారు. దీని నిర్వహణకు ఒక సొసైటీ ఉండగా, సత్తార్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. కళాశాలకు నిర్వహణకు సంబంధించి ఆర్థిక విషయాల్లో తేడాలు వచ్చి కమిటీ సభ్యులు రెండుగా విడిపోయి, కోర్టులో కేసులు వేశారు. కళాశాల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన కోర్టు.. అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి, మెజారిటీ సభ్యులతో కళాశాల నిర్వహించేందుకు ఆదేశాలిచ్చింది. వీరు శేషయ్య అనే వ్యక్తిని ప్రిన్సిపాల్గా నియమించారు. ఈ క్రమంలో శుక్రవారం సత్తార్, అతని కుమారుడు జిలానీని సొసైటీ సభ్యులైన షేక్ హుస్సేన్ (62), కుక్క బీరయ్య, నాతాని అశోక్ ఆర్థిక విషయాలపై నిలదీశారు. ఈ క్రమంలో టంగుటూరుకు చెందిన హుస్సేన్పై సత్తార్ దాడి చేసి, కత్తితో పొడిచాడు. చీరాల ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.