సంఘటిత సమాజంతోనే బాలల హక్కుల పరిరక్షణ
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:21 AM
సమాజం సంఘటితమై పిల్లల భద్రతకు బాధ్యత వహించాలని, అప్పుడే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సమాజం సంఘటితమై పిల్లల భద్రతకు బాధ్యత వహించాలని, అప్పుడే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో శనివారం జాతీయ బాలల హక్కుల కమిషన్.., రాష్ట్ర మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్థుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాలల హక్కుల కీలక అంశాలైనవిద్య, జువెనైల్ జస్టిస్, పోక్సో చట్టం అమలుపై సదస్సు జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ బాల, బాలికలపై జరిగే నేరాల విషయంలో వారికి అవగాహన పెంచడం అత్యంత అవసరమని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 192 కేసులు బాలలపై లైంగిక నేరాలకు సంబంధించినవి నమోదవుతున్నాయని వెల్లడించారు. చిన్నపిల్లలు తమ హక్కుల కోసం పోరాడలేరు కాబట్టి సమాజం వారి భద్రతకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. సూర్యకుమారి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.