తేడా రావొద్దు! పార్టీకి నష్టం చేస్తే కఠినంగా ఉంటా: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:13 AM
‘మీకైనా.. నాకైనా పార్టీయే సుప్రీం. పార్టీ బాగుంటే మనందరం బాగుంటాం. పార్టీకి నష్టం కలిగించే వారి విషయంలో కఠినంగా ఉంటా. తేడాగా ఉన్న వాళ్లను, తప్పులు చేసిన వాళ్లను..
మీకైనా.. నాకైనా పార్టీయే సుప్రీం
ఫేక్ రాజకీయాలు.. దుష్ప్రచారాలే గొడ్డలి పార్టీ విధానం
డీఎస్సీపై గట్టి కౌంటర్లు ఇవ్వడంతో కంగు తింది
ఆ పార్టీ ఆగడాలు శ్రుతిమించితే సహించం
అధికారంలో ఉన్నాం.. సహనం, ఓపిక అవసరం
టీడీపీ ఓడిపోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం
ప్రజలకు మంచి చేస్తున్నాం.. స్వేచ్ఛ ఇచ్చాం
ఆత్మవిమర్శ చేసుకుని ముందుకెళ్తున్నాం
కూటమితోనే ఉంటాం.. కూటమిగానే వెళ్తాం
దీనికి అనుగుణంగానే కార్యకర్తలు వ్యవహరించాలి
క్లస్టర్ ఇన్చార్జులతో చంద్రబాబు ‘కాఫీ కబుర్లు’
గత ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఏమని ప్రచారం చేశారో.. అవన్నీ ప్రభుత్వం చేస్తోంది. ఆనాడు చెప్పిన వాటిని నేడు నెరవేరుస్తున్నామనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలి. మనం చేస్తున్న మంచిని గడప గడపకూ వెళ్లి చెప్పాలి.
దుష్ప్రచారం చేయడం, ఫేక్ రాజకీయాలు చేయడమే గొడ్డలి పార్టీ విధానం.. సిద్ధాంతం. కానీ దాని ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ‘మీకైనా.. నాకైనా పార్టీయే సుప్రీం. పార్టీ బాగుంటే మనందరం బాగుంటాం. పార్టీకి నష్టం కలిగించే వారి విషయంలో కఠినంగా ఉంటా. తేడాగా ఉన్న వాళ్లను, తప్పులు చేసిన వాళ్లను రాష్ట్రం, పార్టీ శ్రేయస్సు కోసం వదిలించుకుంటా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. అక్కడ శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్చార్జులతో ‘కాఫీ కబుర్లు’ సమావేశంలో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని.. వాటితోపాటు క్షేత్రస్థాయిలోనూ ఎవరి పనితీరు ఏమిటనేది తెలుసుకుంటున్నానని చెప్పారు. తప్పులు చేసిన వాళ్లను పిలిపించి పద్ధతి మార్చుకోమని ఒకటికి రెండు సార్లు చెబుతున్నానని, అప్పటికీ మారని వారిని వదిలించుకునేందుకూ సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. ‘మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులేసింది. సీపీఎ్సను వారం రోజుల్లో రద్దు చేస్తామని పక్కన పెట్టేసింది. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని మాట తప్పింది. అంతటితో ఆగకుండా వ్యవస్థలను విధ్వంసం చేసింది.
వాళ్లు చెప్పినవి చేయకపోగా మనం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025పై బురదజల్లుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఎలా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో డీఎస్సీ విషయంలోనూ అదే విధంగా దుష్ప్రచారంతో లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఆధారాలతో గట్టిగా ఇచ్చిన కౌంటర్లతో గొడ్డలి పార్టీ కంగుతింది.. ఆ పార్టీ నేతలు డిఫెన్సులో పడ్డారు’ అని తెలిపారు. మనం అధికారంలో ఉన్నామని..సహనం, ఓపిక అవసరమని శ్రేణులకు సూచించారు. సమస్యలను చెప్పుకొనేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. వారినుంచి సీఎం వినతులు స్వీకరించారు.
గెలిపించే బాధ్యత నాది..
యుద్ధాన్ని గెలిపించే బాధ్యత నాది. నాతోపాటు అలుపెరగకుండా యుద్ధం చేసే బాధ్యత మీది. ప్రతి బూత్లోనూ గతానికి మించి ఓట్లు రావాలి. కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీపరంగా చేయాల్సిదంతా చేస్తాం. అన్ని రకాలుగా అండగా ఉంటాం. ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించాలి. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కార్యకర్తలందరూ సీక్రెట్ అనే పుస్తకాన్ని చదవాలి. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. నాయకులుగా ఎదగాలనే సంకల్పంతో పనిచేస్తే అది నెరవేరడానికి కావలసిన ఎకో సిస్టం ఆటోమేటిగ్గా ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు చేసేవాళ్ల చుట్టూ మంచివాళ్లే తోడవుతారు. చెడు ఆలోచనలు చేసే వాళ్ల చుట్టూ గొడ్డలి బ్యాచ్ జమ అవుతుంది. ఇకపై పార్టీకి ఓటమి లేదు.. రాదు.. ఆస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలతో మంచిగా ఉంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం. సంక్షేమం-అభివృద్ధి చేస్తున్నాం.. ముఖ్యంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. పార్టీ పదవులు మొదలుకొని టికెట్ల కేటాయింపుల వరకు నిరంతర సర్వేలు చేస్తున్నాం. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.
లోకేశ్.. మంగళగిరిని టీడీపీ కంచుకోటలా చేశారు
మంగళగిరిలో టీడీపీ గెలిచి చాలా కాలమైంది. 2019 ఎన్నికల్లో లోకేశ్ అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పట్టుపట్టి పనిచేసి 2024లో అద్భుత విజయం సాధించారు. గెలిచిన తర్వాత కూడా మంగళగిరిలో చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడది టీడీపీ కంచుకోటగా మారింది.