CM Chandrababu: అన్నింటా స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:29 AM
స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అన్ని అంశాల్లోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
పౌరసేవలు, పథకాలపై నిరంతరం సమీక్షించాలి: సీఎం
స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు శాఖ క్యాలండర్ ఆవిష్కరణ
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అన్ని అంశాల్లోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుతున్న పౌరసేవలు, పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. దాదాపు 800 రకాల సేవల్ని ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్నాయని తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించాలన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారం చేయూత కారణంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మేర ఘనవ్యర్థాలు రీసైకిల్ కావాలని సూచించారు. తడిచెత్తను కంపోస్టు తయారీకి, ఘన వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తరలించాలన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు బ్యాండ్విడ్త్ను విస్తరించాలన్నారు. అనంతరం స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డ్ శాఖ 2026 క్యాలండర్ను మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సమీక్షకు మంత్రి కొలుసు పార్థసారథి, సీఎస్ విజయానంద్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో పాటు రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ, ఆర్టీజీఎస్, ఆర్థిక, ప్రణాళిక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.