YSRCP Activists Arrested: కోడిని కోసి.. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:21 AM
వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగా పలు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు రక్తచరిత్ర లిఖించారు.
వీడియో తీసి.. బ్యాక్గ్రౌండ్లో రక్తచరిత్ర పాట
తిరుపతిలో ఇద్దరు వైసీపీ కార్యకర్తల అరెస్టు, విడుదల
తిరుపతి(నేరవిభాగం), జనవరి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగా పలు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు రక్తచరిత్ర లిఖించారు. జంతు బలులుచేసి.. ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో మేకపోతు మెడనరికి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసి అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో తిరుపతిలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. తిరుపతి నగరం కట్టకిందపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బంధువు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆయన స్నేహితుడు, ప్రైవేటు ఉద్యోగి అయిన భువన్కుమార్ కలిసి జగన్ జన్మదినం సందర్భంగా గత నెల 21న జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ ఎదుట కోడిని కోసి, కోడి రక్తంతో ఫ్లెక్సీలో జగన్, అభినయ్రెడ్డి ఫొటోలకు రక్తాభిషేకం చేశారు. దీనిని వీడియో తీసి.. దానికి రక్త చరిత్ర సినిమాలోని ‘అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకు రాత పెడత...’ అంటూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిపై స్థానికుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదుచేసి గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. సాయంత్రం తిరుపతి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా వారికి బెయిల్ మంజూరు చేశారు. కాగా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి కోర్టు వద్దకు వచ్చి నిందితులను పరామర్శించారు.