నేడు సీఎం నేతృత్వంలో మంత్రులు, కార్యదర్శుల భేటీ
ABN , Publish Date - Feb 09 , 2026 | 04:18 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి...
జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యలపై చర్చ
వర్చువల్గా హాజరుకానున్న కలెక్టర్లు, ఎస్పీలు
అమరావతి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ -జీఎస్డీపీ) వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై సీఎం సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా పాల్గొంటారు. జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర- 2047 విజన్ లక్ష్యాలతో పాటు రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై సమీక్షించనున్నారు. 2026-27లో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.