Share News

ఎమ్మెల్యేలను పోలవరం తీసుకువెళ్లండి

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:30 AM

పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని శాసన సభ్యులకు చూపించాలని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు కోరారు.

ఎమ్మెల్యేలను పోలవరం తీసుకువెళ్లండి

  • స్పీకర్‌ను కోరిన సీఎం చంద్రబాబు

  • త్వరలోనే సందర్శిస్తాం: అయ్యన్న

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని శాసన సభ్యులకు చూపించాలని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు కోరారు. జాతీయ స్థాయిలో అత్యంత పెద్ద ప్రాజెక్టు ఇదేనని, సమీప భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణం జరిగే అవకాశం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తికావొచ్చాయన్నారు. 2014-19లో 73 శాతం పనులు పూర్తి చేశామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌.. పోలవరం ప్రాజెక్టునూ విధ్వంసానికి గురిచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని గాడిలో పెట్టామని, గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేసి, నీరందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు త్వరలోనే పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలతో కలసి సందర్శిస్తానని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. జల వనరుల శాఖ మంత్రి రామానాయుడితో మాట్లాడి పర్యటనను ఖరారు చేస్తానన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 04:31 AM