ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 28 , 2026 | 08:58 AM
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
అమరావతి, మే 28: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాతుడు, మహామనిషి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’..
‘1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ వినీలాకాశంలో రాముడుగా, కృష్ణుడుగా చెరగని ముద్ర వేసిన ఆయన రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారు. తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త ఆయన. ఆ యుగ పురుషుడికి మరొక్కమారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
మూడు తరాలుగా అదే గౌరవం
నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి తన ఎక్స్ పోస్టులో.. ‘మూడు తరాలుగా చూస్తున్నాను. ఎన్టీఆర్ అంటే నేటి తరానికి కూడా అదే గౌరవం, అదే అభిమానం. ఎందుకంటే రాజకీయాలలో ఆయన ఏదయితే చెప్పారో దాన్ని ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని అయినా ఆచరణలో అమలుచేసి చూపించారు. ఆ నిబద్ధతే ఆయనను తెలుగువారికి 'అన్నగారిని' చేసింది. నాన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
వేసవి ఆటలు.. అధికారులకు కాసులు..!
ఎన్టీఆర్ ఆశయాలే నా జీవన మార్గం: బాలకృష్ణ