ఐకేర్ సెంటర్లతో గ్రామీణులకు ఎంతో మేలు
ABN , Publish Date - May 02 , 2026 | 04:25 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న ఐ కేర్ సెంటర్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.
అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయి: సీఎం
గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం
మచిలీపట్నం/గుడ్లవల్లేరు, మే 1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న ఐ కేర్ సెంటర్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అత్యాధునిక వసతులతో వీటి ఏర్పాటుతో గ్రామీణులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జీఎన్ రావు, దాత, ప్రముఖ పారిశ్రామికవేత్త జాస్తి వెంకట్ పాల్గొన్నారు. ఏడాదికి 50 వేల మంది అవుట్ పేషెంట్లకు వైద్యసేవలు, 5 వేల మందికి శస్త్ర చికిత్సలు చేసే సామర్థ్యంతో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు అభినందనీయమని ముఖ్యమంత్రి చెప్పారు. లాభాపేక్ష లేకుండా ఆంధ్రపదేశ్, కర్ణాటక, ఒడిస్సా రాష్ర్టాల్లో ఎల్వీ ప్రసాద్ ఐకేర్ సెంటర్ల ద్వారా సేవలు అందించడం ఈ సంస్థ సేవాభావాన్ని తెలియజేస్తోందన్నారు. ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సహకరించిన సువెన్లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ జాస్తి వెంకట్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.