చంద్రబాబు నీళ్లు పారిస్తుంటే.. జగన్ రక్తం పారిస్తున్నాడు
ABN , Publish Date - May 07 , 2026 | 03:35 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు పొలాల్లోకి నీరు పారిస్తుంటే... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్తం పారిస్తున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
వెలిగొండకు కూటమి అత్యంత ప్రాధాన్యమిస్తోంది: రామానాయుడు
అమరావతి, పెద్ద దోర్నాల, మే 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పొలాల్లోకి నీరు పారిస్తుంటే... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్తం పారిస్తున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం తన పుట్టిన రోజునాడు వేడుకలకు, సన్మానాలకు దూరంగా... వెలిగొండ టన్నెల్స్లో ప్రాజెక్టు పరిశీలనలో గడిపిన ఆయన... బుధవారం విజయవాడకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. ‘వెలిగొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పోలవరంతో సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు సంక్లిష్టమైపోవడానికి ఐదేళ్ల జగన్ విధ్వంసకర పాలనే కారణం. వెలిగొండ ప్రాజెక్టులో రూ.2000 కోట్లు విలువ చేసే పనులు మిగిలి ఉండగానే ఎన్నికలకు ముందు జగన్ బిల్డప్ ఇచ్చారు. జాతికి అంకితమిచ్చినట్లు ప్రకటించి రాష్ట్రానికి ద్రోహం చేశాడు. చేసిన పనికి కించిత్తయినా పశ్చాత్తాప పడకుండా మరింత ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారు. రప్పా రప్పా నరుకుతా, రక్తం చిందిస్తా అంటూ ప్రకటనలు ఏమిటి? రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేవారు కావాలో, రక్తం పారించేవారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. పోలవరంతో పాటు వెలిగొండ, రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులైన జీఎన్ఎ్సఎ్స, హెచ్ఎన్ఎ్స అతి ముఖ్యమైనవిగా ప్రభుత్వం భావిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్లో 20 గంటలపాటు ఉండి లైనింగ్, బెంచింగ్ పనులను పరిశీలించా. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరకోవడానికి రాత్రింబవళ్లు పని చేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చేందుకే వారితో గడిపా’ అని నిమ్మల తెలిపారు.
19 కి.మీ. టన్నెల్లోకి...
వెలిగొండ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై వారు చెప్పిన సమాచారం సరిగా లేకపోవడంతో రాత్రి 7 గంటలకు టన్నెల్ లోపలికి వెళ్లారు. 19 కి.మీ. దూరం వెళ్లి లైనింగ్ పనులను పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్న ఆయన కార్మికులు, అధికారులకు పనులు వేగవంతంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. మంత్రి వెంట ప్రాజెక్టు సీఈ రమేశ్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఎస్ఈ అబుత్అలీ తదితరులు పాల్గొన్నారు.