‘గోదావరి-కావేరి’ సంధానానికి కేంద్రం సిద్ధం!
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:32 AM
గోదావరి- కావేరీ నదుల అనుసంధానానికి కేంద్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. భాగస్వామ్య రాష్ట్రాలతో రెండుమూడు వారాల్లోనే దీనిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలో భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం
చంద్రబాబుకు జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ
తెలంగాణ-ఏపీ జల వివాదాల్లో జోక్యం చేసుకోండి
సుప్రీం తుది తీర్పు వచ్చేదాకా ఆలమట్టి ఎత్తుపై నోటిఫికేషన్ వద్దు
పాటిల్ను కోరిన సీఎం.. పోలవరం రెండోదశకు నిధులివ్వాలని వినతి
ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి.. ఫిష్ మీల్ ఎగుమతులపై నియంత్రణ
విశాఖ మెట్రోకు అనుమతులు ఇవ్వండి.. పీయూష్ గోయల్, ఖట్టర్కు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): గోదావరి- కావేరీ నదుల అనుసంధానానికి కేంద్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. భాగస్వామ్య రాష్ట్రాలతో రెండుమూడు వారాల్లోనే దీనిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల విషయంలో సయోధ్య కుదిర్చేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, పీయూశ్ గోయల్, మనోహర్లాల్ ఖట్టర్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. సీఆర్ పాటిల్తో జరిగిన భేటీలో....పోలవరం, జల్జీవన్ మిషన్, సాగునీరు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. బనకచర్ల నుంచి కావేరీ అనుసంధానం ప్రయోజనకరంగా ఉంటుందని జలశక్తి అధికారులు తెలిపారు. పోలవరం- బనకచర్ల ప్రతిపాదన స్ఫూర్తితోనే ఈ కొత్త ఆలోచన వచ్చిందన్నారు. అన్ని రాష్ట్రాలతో, భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.
శ్రీశైలం నుంచి అనుసంధానంపై దృష్టి
గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని తీసుకువస్తే మహారాష్ట్ర కూడా భాగం అడుగుతుందేమో అని జలశక్తి అధికారులు సంశయాన్ని వ్యక్తం చేయగా, నీటిని అన్ని రాష్ట్రాలూ సమానంగా తీసుకుంటే నష్టం ఏమి ఉంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవేళ శ్రీశైలం నుంచి అనుసంధానిస్తే.. గ్రావిటీ ద్వారానే కావేరికి నీళ్లు చేరుకుంటాయని చంద్రబాబు వివరించారు. అది ఇంకా ఉపయోగకరమని, ఖర్చు కూడా తగ్గుతుందని ఈ సందర్భంగా సీఆర్ పాటిల్ బదులిచ్చారు. శ్రీశైలం నుంచి సాధ్యం కానీ పక్షంలో బనకచర్ల నుంచి అనుసంధానించే అంశంపై దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. శ్రీశైలం నుంచి కంటే బనకచర్ల నుంచి అనుసంధానమే సానుకూలమని జలశక్తి అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రూ.55 వేల కోట్లతో పూర్తి అవుతున్న నేపథ్యంలో గోదావరి-కావేరీ నదుల అనుసంధానంలో ఆ మేరకు భారం తగ్గుతుందని చంద్రబాబు అన్నారు. అన్ని రాష్ట్రాలను ఒప్పిస్తే కేంద్ర ప్రతిపాదన విషయంలో తనకేం అభ్యంతరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా, పాటిల్ అంగీకరించారు. త్వరలోనే భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశపరుస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలపై కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినందున త్వరితగతిన వివాదాలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని సీఆర్ పాటిల్ను ఆహ్వానించారు. పోలవరం ఎడమ కాలువను శ్రీకాకుళం వరకు తీసుకెళ్లే అంశం పరిశీలించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు రెండో దశకు ఆర్థిక సహాయం అందించాలని, వర్క్ స్టాప్ ఆర్డర్ను పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి సాంకేతిక-ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంతవరకూ ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే అంశంపై గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయరాదని సీఎం కోరారు.
ఆక్వాను ఆదుకోండి: పీయూశ్కు సీఎం వినతి
ఆక్వా రైతులు, రొయ్యల దాణా తయారీదారులు, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఆక్వా, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆక్వా, పొగాకు రంగాల అభివృద్థికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు రైతుల సంక్షేమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆక్వా, పొగాకు రంగాలను ఆదుకునేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఫిష్మీల్, ఫిష్ ఆయిల్, సోయాబీన్ మీల్, విటమిన్లు, ఖనిజాల ధరలు పెరగడం వల్ల ఆక్వా ఫీడ్ తయారీ వ్యయం భారీగా పెరిగిందని వివరించారు. ఫిష్మీల్లో అత్యధిక భాగం విదేశాలకు ఎగుమతి కావడం వల్ల దేశీయంగా తీవ్ర కొరత ఏర్పడుతోందని, ఫీడ్ తయారీ వ్యయం పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందని తెలిపారు. ఫిష్మీల్, ఫిష్ ఆయిల్ ఎగుమతులపై తాత్కాలిక నియంత్రణ విధించడం, అవసరమైతే పరిమితులు విధించడం లేదా దేశీయ అవసరాలకు ప్రాధాన్యంఇవ్వడం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీఎం సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతులు కల్పించడం, ఆక్వా ఫీడ్ ముడిపదార్థాల లభ్యతను మెరుగు పరచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, ప్రధాన దిగుమతి దేశాల్లో భారత రొయ్యలకు కొత్త మార్కెట్లు కల్పించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు, ఆక్వా ఫీడ్ తయారీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
మెట్రో ప్రాజెక్టులను సాకారం చేయండి: ఖట్టర్ను కోరిన చంద్రబాబు
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం, నిధుల కేటాయింపు, సత్వర అమలుకు అవసరమైన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని సీఎం కోరారు. సవరించిన మెట్రో ప్రాజెక్టు డీపీఆర్లను కేంద్ర ఆమోదానికి పంపినట్టు కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. కాగా, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, వివిధ రంగాల్లో ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్య రంగాన్ని బలోపేతం చేయడం, రైతు సంక్షేమాన్ని పెంపొందించడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సమ్మిళిత వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించడంపై చర్చలు జరిపినట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్థికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి ఖట్టర్ తెలిపారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు, బస్తీపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, అంబికా లక్ష్మీనారాయణ, జీఎం హరీశ్, శ్రీ భరత్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కేశినేని చిన్ని; జనసేన ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్; బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తదితరులు ఉన్నారు.