నేటి నుంచే జనగణన
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:29 AM
ప్రపంచంలోనే అతి పెద్ద గణాంక కార్యక్రమమైన భారతదేశ జనగణన-2027 ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్లో రంగం సిద్ధమైందని రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతి పెద్ద గణాంక కార్యక్రమమైన భారతదేశ జనగణన-2027 ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్లో రంగం సిద్ధమైందని రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. మొదటి దశ కింద గురువారం నుంచి ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్) ప్రారంభం కానుందని చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామన్నారు. దీంతోపాటు స్వీయ గణన సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. ఈ జనగణన ఓ సమగ్ర, సాంకేతిక ఆధారిత, భద్రతతో కూడిన విస్తృత కార్యక్రమమని చెప్పారు. ప్రజలు స్వీయగణన ద్వారా, లేదా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు సహకరించాలని ఆయన కోరారు జనగణనకు ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా క్రిమినల్ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనగణన ఎన్యూమరేటర్లుగా 80 శాతం మంది స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులనే కలెక్టర్లు నియమించారని, మిగిలిన 20 శాతం మంది ఇతర శాఖల ఉద్యోగులని చెప్పారు. వారికి సమాచారం ఇస్తే ఏమౌతుందో అనే భయం అక ్కర్లేదన్నారు. రాష్ట్రంలో ఈనెల 16 నుంచి స్వీయగణన విధానం ప్రారంభమై, 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.