సీసీఐ రామకృష్ణ తల్లికి తుది వీడ్కోలు
ABN , Publish Date - May 02 , 2026 | 10:51 PM
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మకు తుది వీడ్కోలు పలికారు.
- అంతిమయాత్రకు తరలివచ్చిన రాజకీయ పార్టీల నాయకులు
- కుటుంబ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని రామకృష్ణ భావోద్వేగం
- ఫోనలో చంద్రబాబు పరామర్శ
ఆలూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మకు తుది వీడ్కోలు పలికారు. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో అత్యంత భావోద్వేగభరితంగా ఆమె అంత్యక్రియలు జరిగాయి. రామకృష్ణ తల్లి పాడె మోస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ ఉన్నతికి తన తల్లి ఎంతగానో పాటుపడిందని, కష్టపడి ముందుకు నడిపించిందని, ఆమె స్ఫూర్తితో నాయకుడిగా ఎదిగానని రామకృష్ణ భావోద్వేగంతో అన్నారు. సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు రైతు, కార్మిక, యువజన సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రైతు సంఘం నాయకుడు జగన్నాథం, కర్నూలు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్కుమార్, సీపీఐ మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు చంద్రకాంత్రెడ్డి, జనసేనదళ్ రాష్ట్ర నాయకుడు మురళి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ, రాధాకృష్ణ, అంజిబాబు, టీడీపీ నాయకుడు రామ్నాథ్యాదవ్, ఏబీసీ చైర్మన్ నగరడోన కిష్టప్ప, పటేల్యాదవ్, సీనప్ప, ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూల రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీరాములు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగరాజుగౌడ్, ఐజేయూ నాయకుడు కొండప్ప పాల్గొన్నారు.
- రామకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శ
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణను సీఎం చంద్రబాబునాయుడు ఫోన్లో పరామర్శించారు. గౌరమ్మ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.