విదేశీ వాణిజ్య శాఖ ఉద్యోగిపై సీబీఐ కేసు
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:58 AM
లంచం తీసుకుని ఒక కంపెనీకి మేలు చేసిన విదేశీ వాణిజ్య శాఖ ఉద్యోగితోపాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక కన్సల్టెంట్, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు.
లంచం తీసుకుని ఓ కంపెనీకి మేలు చేసినట్టు అభియోగం
విశాఖపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): లంచం తీసుకుని ఒక కంపెనీకి మేలు చేసిన విదేశీ వాణిజ్య శాఖ ఉద్యోగితోపాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక కన్సల్టెంట్, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. విశాఖపట్నంలోని విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో శ్రీభాష్యం వెంకట రంగనాథన్ సెక్షన్ హెడ్గా పనిచేస్తున్నారు. పీఎల్ఆర్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు లైసెన్స్ మంజూరు/పునరుద్ధరణ కోసం చెన్నైకు చెందిన ప్రైవేటు కన్సల్టెంట్ రవిచంద్రన్ ద్వారా ఆయన్ను సంప్రతించారు. ఈ ప్రక్రియలో చట్టవిరుద్ధంగా పనిచేసేందు కు రవిచంద్రన్ ఖాతా నుంచి రంగనాథన్కు చెందిన విజయనగరం కోట బ్రాంచి ఎస్బీఐ ఖాతాకు గత నెల 25న రూ.20 వేలు, ఆయన కుమార్తె ఖాతాకు రూ.ఐదు వేలు జమ అయ్యాయి. దీనిపై సీబీఐ అధికారులకు సమాచారం అందడంతో ఇటీవల తనిఖీ చేశారు.