అద్దం లేకపోతే ఏం?!..హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతా!
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:51 AM
మార్కాపురంలో మరో ట్రావెల్స్ బస్సు యాజమాన్య నిర్వాకం ప్రయాణికులకు ఆగ్రహం తెప్పించింది. గతనెల 26న మార్కాపురం సమీపంలో 14 మందిని...
ట్రావెల్స్ బస్సు ఫిట్నె్సపై ప్రయాణికుల ఆగ్రహం.. కేసు నమోదు
మార్కాపురం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మార్కాపురంలో మరో ట్రావెల్స్ బస్సు యాజమాన్య నిర్వాకం ప్రయాణికులకు ఆగ్రహం తెప్పించింది. గతనెల 26న మార్కాపురం సమీపంలో 14 మందిని పొట్టనపెట్టుకున్న ట్రావెల్స్ బస్సు ఉదంతం ఇంకా కళ్లముందు మెదిలాడుతుండగానే.. ఆదివారం బెంగళూరు బయలుదేరిన బస్సు తీరును చూసి ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీలక్ష్మీనరసింహ ట్రావెల్స్ బస్సు (ఎన్ఎల్డీ 1బీ 3888) మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. 36 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ముందు భాగం అద్దం లేకుండా పగిలిపోయి ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్ను నిలదీశారు. ‘అద్దం లేకపోతే ఏం? మీకు ఇబ్బంది లేదు కదా? నేను హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతా’నని ఆయన వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. బస్సును స్టేషన్ వద్దకు తీసుకువచ్చిన పోలీసులు ప్రయాణికుల చార్జీ నగదును యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని చెప్పారు. అత్యవసరంగా వెళ్లాల్సిన ఆరుగురి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి పంపించారు. ప్రయాణికుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని సీఐ సుబ్బారావు తెలిపారు. బస్సును స్టేషన్లో ఉంచామని, రవాణాశాఖ అధికారులకు విషయం తెలియజేస్తామన్నారు. ఫిట్నె్సలేని బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.