కోర్టులకు బాంబు బెదిరింపులు
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:56 AM
ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.
ఉమ్మడి తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో కలకలం
రాజమహేంద్రవరం/అనంతపురం క్రైం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టులో బాంబు సరిగ్గా మధ్యాహ్నం 12.35 గంటలకు పేలుతుందని కాల్ రావడంతో ఉదయం 10 గంటల సమయంలో ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో బాంబ్, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. ప్రాంగణంలోని అన్ని కోర్టులు, బార్ అసోసియేషన్ గది, జడ్జిల చాంబర్లలో క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. సుమారు 4 గంటలపాటు తనిఖీలు జరిపి నకిలీ కాల్ అని పోలీసులు తేల్చారు. మరోవైపు.. అనంతపురం జిల్లా కోర్టును బాంబులతో పేల్చేస్తామని బుధవారం ఉదయం మెయిల్కు బెదిరింపు సందేశం వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టుకు, గుంతకల్లులోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు సైతం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో న్యాయాధికారులు, న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపి, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాల ఆనవాళ్లు లేకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపులుగా తేల్చారు.