బొల్లాకు 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:21 AM
గండిపేటలో వెలుగులోకి వచ్చిన రూ.1000 కోట్ల భూ కుంభకోణం కేసులో కీలక సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు..
హైదరాబాద్లో 1000 కోట్ల భూ స్కాంలో సూత్రధారి
నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్!
హైదరాబాద్ సిటీ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): గండిపేటలో వెలుగులోకి వచ్చిన రూ.1000 కోట్ల భూ కుంభకోణం కేసులో కీలక సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బ్రహ్మనాయుడును పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న 9.28 ఎకరాల భూమిని కాజేసేందుకు నకిలీ జీవోలు, పత్రాలు సృష్టించడంలో ఆరితేరిన రాధాకృష్ణతో కలిసి బ్రహ్మనాయుడు, అతడి సోదరుడు రమేశ్ కుట్ర పన్నిట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు రాధాకృష్ణతోపాటు పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. అసలు సూత్రదారి బ్రహ్మనాయుడును కాంచీపురంలో శుక్రవారం అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే. శనివారం ఆయన్ను నగరానికి తీసుకొచ్చిన పోలీసులు.. 3 గంటల పాటు విచారించినట్లు తెలిసింది. అనంతరం ఉపరపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించడానికి బ్రహ్మనాయుడు, రాధాకృష్ణ, రమేష్, డ్రైవర్ ప్రవీణ్తో పాటు అరెస్టయిన నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.