ఏఐతో ‘ఇబ్బందే’!
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:54 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో భవిష్యత్తులో ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం కచ్చితంగా ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగ సమస్య తలెత్తుతుంది పనిలో ‘హ్యూమన్ టచ్’ పోతుంది:గేట్స్
అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో భవిష్యత్తులో ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం కచ్చితంగా ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎ్సలో జరిగిన భేటీలో ఆయన రాష్ట్ర మంత్రులు, అధికారులతో ముచ్చటించారు. ఏఐ గురించి వాణిజ్య పన్నుల కార్యదర్శి అహ్మద్బాబు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘‘ఏఐతో నిరుద్యోగ సమస్య వస్తుంది. ప్రతి పనిలో హ్యూమన్ టచ్ తగ్గుతుంది.’’ అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విషయాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. ‘‘ఔను. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో ఏపీకి చెందిన నిపుణుల సంఖ్య అధికం. వీరిలో చాలామంది సొంత గడ్డపై నుంచి పని చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటు చేశాం’’ అని గేట్స్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఉందని మంత్రి సత్యకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.