ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం మైలురాయి: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:37 AM
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఓ మైలురాయి అని ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ పుడ్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి అన్నారు.
భోగాపురం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఓ మైలురాయి అని ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ పుడ్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి అన్నారు. హెరిటేజ్ కంపెనీ వ్యవహారాల నిమిత్తం విశాఖ వెళ్లేందుకు ఆమె బుధవారం భోగాపురం విమానాశ్రయంలో దిగారు. ఆమెకు మార్క్ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘మన సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా ఎయిర్పోర్టులో చిత్రాలు, ఏటికొప్పాక బొమ్మలు ఏర్పాటు చేయడం చాలా బాగుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నాయకత్వం, యువ నాయకుడు, మంత్రి లోకేశ్ ప్రత్యేక చొరవతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి అభివృద్ధికి బాటలు వేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు’ అని అన్నారు.