ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం కీలకం
ABN , Publish Date - May 16 , 2026 | 04:23 AM
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటున్న భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్లోబల్ కనెక్టవిటీగా మారనుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు.
త్వరలోనే విమానాశ్రయం ప్రారంభం
పనులు పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
భోగాపురం/పూసపాటిరేగ,మే15 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటున్న భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్లోబల్ కనెక్టవిటీగా మారనుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పనులు 99.3 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.మాధవ్తో కలిసి శుక్రవారం ఆయన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ ఆధునిక టెర్మినల్స్, విశాలమైన రన్వేలు, కార్గోహబ్లతోపాటు లాజిస్టిక్ సెంటర్తో ఏయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. అత్యాధునిక భద్రతతోపాటు, విస్తృత పార్కింగ్, రవాణా సదుపాయాలు, హోటల్స్, కమర్షియల్ బిజినెస్ స్పేస్లతో రూపుదిద్దుకుంటోందన్నారు. దీనిద్వారా వేలాదిమంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటక అభివృద్ది, ఐటీ, పారిశ్రామిక రంగాలకు విశేష ప్రోత్సాహం లభించి.. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్దికి కీలకంగా మారుతుందని తెలిపారు.