భోగాపురానికి 20 ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:30 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి కొత్త ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
ప్రారంభించిన మంత్రి అనగాని, ఎంపీ శ్రీభరత్
విశాఖపట్నం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి కొత్త ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం భోగాపురం ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలు మొదలు కానున్న నేపథ్యంలో శనివారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ వీటిని ప్రారంభించారు. మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయానికి విశాఖ నుంచి రోజుకు 20 ఎలక్ర్టిక్ బస్సులు నడుపుతున్నామన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహిళలు విశాఖపట్నంలో ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ఆర్టీసీ ఆర్.ఎం. అప్పలనాయుడు మాట్లాడుతూ.. భోగాపురానికి పది ఎలక్ర్టిక్ బస్సులు గాజువాక నుంచి ఎన్ఏడీ, మద్దిలపాలెం మీదుగా.. మరో పది బస్సులు సంధ్య థియేటర్, ఐటీ పార్కు మీదుగా నడుస్తాయని తెలిపారు. గాజువాక నుంచి రూ.400, ద్వారకా స్టేషన్ నుంచి రూ.300 టికెట్ ధర ఖరారు చేశామన్నారు. మంత్రి, ఎంపీ, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఇతర అధికారులు కలిసి పోలీస్ బ్యారెక్స్ నుంచి ఆర్కే బీచ్ వరకు బస్సులో ప్రయాణించారు.