షుకూర్ ఎవరో తెలీదు..!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:57 AM
‘బెనెక్స్ కాం’ పేరుతో గ్రూపు ఏర్పాటుచేసుకుని ఉగ్రవాద సంస్థలకు, వాటికి సంబంధించిన సాహిత్యంపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన నిందితులు పోలీసు కస్టడీలో...
పోలీసు కస్టడీలో ఉగ్ర సానుభూతిపరుల వాంగ్మూలం
విజయవాడ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ‘బెనెక్స్ కాం’ పేరుతో గ్రూపు ఏర్పాటుచేసుకుని ఉగ్రవాద సంస్థలకు, వాటికి సంబంధించిన సాహిత్యంపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన నిందితులు పోలీసు కస్టడీలో భిన్న సమాధానాలు చెబుతున్నారు. విజయవాడ పోలీసులు, సీఐ సెల్, ఏటీ ఎస్, ఐబీ అధికారులు.. రహ్మతుల్లా షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్, సయిదా బేగం, అబ్దుల్ సలాంను విచారిస్తున్నారు. మొత్తం 7 రాష్ట్రాలకు చెందిన సానుభూతిపరులు బెనెక్స్ కాం గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. ఈ నెట్వర్క్కు సంబంధించిన 12 మందిలో ఏడుగురు రిమాండ్లో ఉన్నారు. వీళ్లందరికీ అల్ హకీం షుకూర్ కొన్ని అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు పో లీసులు గుర్తించారు. ఈ షుకూర్ ఎవరన్న విషయంపై నిఘా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. షుకూర్ పాకిస్థాన్ నుంచి నెట్వర్క్ను నడుపుతున్నాడని అనుమా నిస్తున్నారు. అయితే షుకూర్ ఎవరో తెలియదని విచారణలో నిందితులు చెప్పినట్టు తెలిసింది. అతడు ఏక్యూఐఎస్(ఆల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్), ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) గ్రూపులను ఏర్పాటు చేయించి ఇన్స్టా, టెలిగ్రామ్ల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రచారం చేయిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. షుకూర్తో తామెప్పుడూ మాట్లాడలేదని, కేవలం చాటింగే చేశామని కస్టడీలో నిందితులు చెప్పినట్టు తెలిసింది.