రమణీయం.. రేణుకా ఎల్లమ్మ రథోత్సవం
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:46 PM
కోసిగి రేణుకా ఎల్లమ్మ రథోత్సవం శనివారం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగింది.
వేలాది మంది తరలివచ్చిన భక్తులు
పాల్గొన్న టీడీపీ నాయకులు తిక్కారెడ్డి, రాఘవేంద్రరెడ్డి
కోసిగి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): కోసిగి రేణుకా ఎల్లమ్మ రథోత్సవం శనివారం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు బసవరాజు గౌడు నేతృత్వంలో ఎల్లమ్మకు కుంకుమార్చన, మంగళహారతి, పుష్పాలంకరణ పూజలు చేశారు. ఆంధ్రాతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆయన తనయులు రాకేష్ రెడ్డి, రాజారెడ్డితో పాటు టీడీపీ మండల నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూలమాలలు, శాలువలతో నాయకులను కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. ముందుగా సాంప్రదాయం ప్రకారం దొరల కుటుంబ సభ్యులు మురళిధొర, శ్రీనివాసుల ధొర, సుందర్ రాజు ధొర కుటుంబ సభ్యులు పూర్ణకుంభంతో సాయంత్రం రథోత్సవానికి ముందు దొరల చావిడి నుంచి మేళతాళాలతో ఆలయం వరకు కలశాలతో ఊరేగింపుతో వచ్చారు. ఈ రథోత్సవంలో టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, నాయకులు పాలకుర్తి దివాకర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్కుమార్రెడ్డి, వైసీపీ మండల ఇనచార్జి మురళిమోహన రెడ్డి, తమ నాయకులు, కార్యర్తలతో కలిసి అమ్మవారి ఆలయం వరకు ర్యాలీగా వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి నేతృత్వంలో కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.