Share News

బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:39 AM

రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన ఐదు అంశాలను మార్చి 31లోగా నెరవేర్చాలని, లేకుంటే ఏప్రిల్‌ 11న జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ తెలిపారు.

బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి

  • మార్చి 31లోగా 5 అంశాలను నెరవేర్చాలి

  • లేకుంటే ఏప్రిల్‌ 11న నిరాహార దీక్ష

  • బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌

పెదకాకాని, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన ఐదు అంశాలను మార్చి 31లోగా నెరవేర్చాలని, లేకుంటే ఏప్రిల్‌ 11న జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఎదుట గల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ‘బీసీ సింహగర్జన’ సభలో ఆయన మాట్లాడారు. బీసీ రక్షణ చట్టం తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ హయాంలో దాడులు జరిగాయని చెప్పి, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలైనా రక్షణ చట్టం చేయలేదన్నారు. రాజధానిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అన్యాయం అమరావతిలో జరగనివ్వమని, ఇది భిక్ష కాదు, బీసీల హక్కు అన్నారు. సమగ్ర కులగణన జరపాలని, తమ జనాభా ఎంతో తేల్చి, తమ రిజర్వేషన్లు తమకు ఇవ్వాలని, బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 1983లో టీడీపీ హామీ ప్రకారం, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలన్నారు. పేరుకే పదవులు ఇచ్చి, నిధులు ఇవ్వకుండా మోసం చేయడం ఆపాలన్నారు. ‘ఈ ఐదు డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి 30 రోజులు సమయం ఇస్తున్నాను. లేనిపక్షంలో ఏప్రిల్‌ 11న పూలే జయంతి రోజున విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా. ఇది మరో కురుక్షేత్రానికి నాంది’ అని అని రామచంద్రయాదవ్‌ హెచ్చరించారు.

Updated Date - Feb 23 , 2026 | 05:40 AM