గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయండి
ABN , Publish Date - May 19 , 2026 | 06:26 AM
మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టులనూ పూర్తిచేసి ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలి అని మౌలిక సదుపాయాల కల్పన శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.
ఈ ఏడాది చివరికి అందుబాటులోకి రావాలి: బీసీ జనార్దనరెడ్డి
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టులనూ పూర్తిచేసి ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలి అని మౌలిక సదుపాయాల కల్పన శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. గ్రీన్ఫిల్డ్ పోర్టులపై సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తదితరులతో మంత్రి సమీక్షించారు. గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణాన్ని నిర్దేశిత కాలంలో పూర్తి చేయడంపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. అధికారులు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను మరింత వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. మూలపేట పోర్టుకు సంబంధించి వివిధ సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. మూలపేట గ్రామం పునరావాస పనులను పూర్తి చేయడం ద్వారా డ్రెడ్జింగ్ పనులను పూర్తి చేసుకొని, ఈ ఏడాదికే పోర్టు నిర్మాణం పూర్తి చేయవచ్చు. మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలి. రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాస సమస్యలను పరిష్కరించాలి. ఫేజ్-1 ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాల్సిందే’ అని మంత్రి ఆదేశించారు.