బార్ అండ్ బెంచ్ మధ్య సత్సంబంధాలు ఉండాలి
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:28 AM
ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం వార్షిక, సాంస్కృతిక దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి...
హైకోర్టు న్యాయవాదుల సంఘం వార్షికోత్సవంలో సీజే
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం వార్షిక, సాంస్కృతిక దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ హైకోర్టులో బార్ అండ్ బెంచ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగేందుకు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారు కృషి చేశారన్నారు. న్యాయవాదుల సంఘానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన వాసిరెడ్డి ప్రభునాథ్ సైతం బార్ అండ్ బెంచ్ మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తారని భావిస్తున్నామన్నారు. కేసు గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి, న్యాయం గెలిచేలా చూడాలని యువ న్యాయవాదులకు సూచించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్.ద్వారకానాథ్రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు కె.చిదంబరం, ఏపీ అడ్వొకేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, జనరల్ సెక్రెటరీ సి.సుబోధ్, కొత్తగా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన వాసిరెడ్డి ప్రభునాథ్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.