ముగిసిన బండ్ల గణేష్ పాదయాత్ర
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:13 AM
‘తిరుమలకు పాదయాత్రగా రావడం ఈ జన్మలో అద్భుతమైన ఘట్టంగా భావిస్తున్నా’ అంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యారు..
శ్రీవారిని దర్శించుకుని సీఎంను కలుస్తానన్న గణేష్
తిరుమల, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ‘తిరుమలకు పాదయాత్రగా రావడం ఈ జన్మలో అద్భుతమైన ఘట్టంగా భావిస్తున్నా’ అంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపిన నేపథ్యంలో.. ఆయన జైలు నుంచి సురక్షితంగా బయటకు వస్తే హైదరాబాద్ నుంచి తిరుమల నడిచి వచ్చి దర్శనం చేసుకుంటానని ఆయన మొక్కుకున్నారు. ఈ క్రమంలో సంకల్పయాత్ర పేరుతో గత నెల హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేపట్టి, మంగళవారం మధ్యాహ్నం అలిపిరి మెట్లమార్గం ద్వారా తిరుమల చేరుకుని పాదయాత్రను పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, తానా మాజీ అధ్యక్షుడు, టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వేమన సతీష్ ఆయనకు స్వాగతం పలికారు. బుధవారం స్వామివారి దర్శనం తర్వాత సీఎంను కలుస్తానని గణేష్ చెప్పారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.