‘బసవతారకం’ ఆస్పత్రి పనులు ప్రారంభం
ABN , Publish Date - May 02 , 2026 | 04:26 AM
రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
తుళ్లూరు, మే 1(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఎక్స్కవేటర్ను నడిపి, మట్టిని తవ్వి టిప్పర్లోకి ఎత్తిపోశారు. తన మాతృమూర్తి స్వర్గీయ నందమూరి బసవతారకం పేరుతో నిర్మాణమవుతున్న ఈ ఆస్పత్రిని రెండు దశల్లో నిర్మిస్తామని తెలిపారు. తొలిదశలో భాగంగా రూ.700 కోట్ల వ్యయంతో 500 పడకలను రోగులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. మొత్తం 21 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి తొలిదశను 2028 నాటికి పూర్తిచేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆస్పత్రి ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నామని బాలకృష్ణ తెలిపారు.