మద్యం కేసు విచారణ వేగవంతం చేయండి
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:17 AM
మద్యం కుంభకోణం, ముడుపుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సీఎం చంద్రబాబును కోరారు.
సీఎంకు బాలకోటయ్య లేఖ
విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం, ముడుపుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సీఎం చంద్రబాబును కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వంలో మద్యం పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారని అన్నారు. పాత బ్రాండ్లను తొలగించి, వారు ఎంపిక చేసిన బ్రాండ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సుమారు రూ.3,500 కోట్ల అక్రమాలు జరిగినట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపించినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్, ఈడీ చేపట్టిన విచారణను వేగవంతం చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలక అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతోందన్నారు. ఈ కేసు దర్యాప్తు నిర్ణీత గడువులో పూర్తిచేసి, అంతిమ విచారణకు విస్తరించాలని కోరారు. నేరం నిరూపితమైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, వారి ఆస్తులు జప్తు చేయాలని బాలకోటయ్య కోరారు.