కోర్టు ఉద్యోగాల పరీక్షకు ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:44 AM
స్థానిక న్యాయ సేవా సదన కార్యాలయంలో పోస్టుల భర్తీకి బుధవారం నిర్వహించే పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కర్నూలు లీగల్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక న్యాయ సేవా సదన కార్యాలయంలో పోస్టుల భర్తీకి బుధవారం నిర్వహించే పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ రెగ్యులర్ పోస్టులకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల మేరకు బుధవారం స్థానిక కొత్తపేటలోని న్యాయ ప్రసూన కళాశాలలో రాత పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు రికార్డు అసిస్టెంట్ పోస్టు పరీక్షకు ఉదయం 8.45 గంటలలోపు ప్రసూన న్యాయ కళాశాలకు చేరుకోవాలని.. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 11.15 గంటలలోపు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని తెలిపారు. సమయం దాటిన తర్వాత గేటు మూసేస్తారని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని ఆయన తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు.