Share News

పెట్టుబడులకు ఏపీ బెస్ట్‌!

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:40 AM

ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటుతో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ సత్తాను చాటి చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో చరిత్ర తిరగరాయబోతున్నామని చెప్పారు.

పెట్టుబడులకు ఏపీ బెస్ట్‌!

  • 20 నెలల్లో రూ.20.35 లక్షల కోట్ల పెట్టుబడులు

  • వచ్చే మూడేళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలు

  • ఆంధ్రుల హక్కు నినాదంతో ‘విశాఖ ఉక్కు’

  • ఇప్పుడు అడగకుండానే అంతకంటే పెద్ద పరిశ్రమ

  • స్టీల్‌ ప్లాంటుకే కాదు.. ‘స్టీల్‌ సిటీ’కి అంకురార్పణ

  • ప్లాంటుకు సహకరించిన ప్రధానికి కృతజ్ఞతలు

  • ‘మిట్టల్‌’ స్టీల్‌ పరిశ్రమ శంకుస్థాపనలో చంద్రబాబు

  • ఏపీపై నమ్మకానికి మా రాకే ఉదాహరణ: లక్ష్మీ మిట్టల్‌

  • ఏపీ అభివృద్ధిలో కీలక మైలురాయి: ప్రధాని మోదీ

సీఎం చంద్రబాబునాయుడు అనే నేను చెబుతున్నా. పెట్టుబడులకు బెస్ట్‌ ప్లేస్‌ ఏపీ. అద్భుతమైన 25 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా తీసుకెళ్తున్నాం.

ప్రపంచంలోనే ఉక్కు పరిశ్రమకు మిట్టల్‌ ఆద్యుడు. అటువంటి వ్యక్తి స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్రానికి రావడం గొప్ప విషయం. రానున్న రోజుల్లో ఈ ప్లాంటు వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని శక్తిగా తయారవుతుంది.

- చంద్రబాబు

నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటుతో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ సత్తాను చాటి చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో చరిత్ర తిరగరాయబోతున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామంలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఏఎం (ఆర్సెలార్‌ మిట్టల్‌)/ఎన్‌ఎస్‌ (నిప్పన్‌ స్టీల్‌) ఇండియా గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌కు సోమవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ‘చంద్రబాబు నాయుడు అనే నేను చెబుతున్నా. పెట్టుబడులకు సరైన గమ్యస్థానం ఏపీ’ అని సగర్వంగా ప్రకటించారు. ఆంధ్రుల హక్కు నినాదంతో గతంలో విశాఖలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసుకున్నామని, ఇప్పుడు అడగకుండానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కంటే పెద్ద పరిశ్రమ నక్కపల్లికి వస్తోందంటే ఈ ప్రాంత ప్రజల అదృష్టమనే చెప్పాలని వ్యాఖ్యానించారు. ఈ రెండు కర్మాగారాలూ దేశ ఉక్కు రంగంలో రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెడతాయన్నారు.

Untitled-6 copy.jpg


ఈ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను అందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన తెచ్చిన మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రానికి ఈ పరిశ్రమ వచ్చిందన్నారు. ‘ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తిచేశామన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు కావస్తోందని.. ఇప్పటికే రూ.20.35 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. ఇవన్నీ పూర్తయితే రానున్న మూడేళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చామని, ఇచ్చిన హామీ మేరకు పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


5,465 ఎకరాల్లో కొత్త ప్లాంటు

5,465 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న కొత్త ఉక్కు పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనిని రెండు దశల్లో పూర్తిచేస్తాం. తొలి దశలో 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (ఎంఎంటీపీఐ), రెండో దశలో 10.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తాం. నక్కపల్లిలో ఏర్పాటుచేస్తున్నది స్టీల్‌ప్లాంట్‌ మాత్రమే కాదు. స్టీల్‌ సిటీకి పునాది. ప్లాంట్‌తో 50 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో క్యాప్టివ్‌ పోర్టు కూడా రానుంది. రూ.11,192 కోట్ల పెట్టుబడితో 316 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టీల్‌ప్లాంట్‌ పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. 2028 డిసెంబరు నాటికి కోల్డ్‌ రోల్డ్‌ ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 2031 జూన్‌ నాటికి ఫస్ట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబరు నాటికి రెండో బ్లాస్‌ ఫర్నేస్‌ ఫేజ్‌-1 కూడా పూర్తవుతుంది. జాతీయ రహదారి నుంచి ఈ పరిశ్రమకు నాలుగు లైన్ల రహదారి నిర్మించడంతోపాటు నీళ్లు అందిస్తాం. విద్యుత్‌ సదుపాయమూ కల్పిస్తాం. స్టీల్‌ప్లాంట్‌కు కావలసిన ఐరన్‌ ఓర్‌ను పైప్‌లైన్‌ ద్వారా తీసుకొస్తారు. సంబంధిత శాఖకు ఈ మేరకు ఆదేశాలిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు.


ఈ వనరులు ఎక్కడా లేవు..

భూములు, లాజిస్టిక్స్‌, నిపుణులు, మానవ వనరులు ఏపీ సొంతం. ఈ స్థాయిలో వనరులు ఎక్కడా లేవు. టూరిజం నుంచి డేటా సెంటర్‌ వరకు, డ్రోన్లు నుంచి ఏఐ టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లోనూ రాష్ట్రానికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్‌ లీడర్స్‌కు నేనొక పిలుపిస్తున్నాను. కొత్త ఆలోచనలతో రాష్ట్రానికి రండి సంపద సృష్టించి వ్యాపారాలను విజయవంతం చేసుకోవడం ద్వారా రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వండి. యువత వినూత్న ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. రతన్‌టాటా ఇన్నేవేషన్‌ హబ్‌ ద్వారా వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌ అనే నినాదాన్ని విజయవంతం చేస్తాం.

విశాఖ ప్రాంతానికి అద్భుత భవిష్యత్‌

విశాఖ ప్రాంతానికి అద్భుతమైన భవిష్యత్‌ ఉంది. తీర ప్రాంతం, టూరిజం, డేటా సెంటర్లు, ఉక్కు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, నాలెడ్జ్‌ ఎకానమీ, లాజిస్టిక్స్‌ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రపంచ స్థాయి నగరంగా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. విశాఖకు ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు స్టీల్‌ సిటీకి పునాది రాయి వేశాం. పక్కనే అల్యూమినియం పరిశ్రమ కూడా రానుంది. మరోపక్క రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ హబ్‌గా కూడా విశాఖ ఆవిర్భవించనుంది. ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఈ సీజన్‌లోనే పోలవరం నుంచి విశాఖకు నీళ్లు తీసుకొచ్చి పరిశ్రమలకు.. తాగునీరు ప్రజలకు అందిస్తాం. కొత్తగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు రానున్నాయి మూలపేట రేవు అభివృద్ధి దశలో ఉంది. పలాసలో కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటును పరిశీలిస్తున్నాం. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జూలైలో ప్రారంభిస్తాం.


పవన్‌, లోకేశ్‌పై ప్రశంసలు

నేను తీసుకునే నిర్ణయాలకు బేషరతుగా సపోర్టు చేస్తున్న పవన్‌ కల్యాణ్‌కు, ప్రాజెక్టును తీసుకురావడంలో నిర్విరామ కృషిచేసిన లోకేశ్‌కు, భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేసిన జిల్లా కలెక్టర్‌కు, యంత్రాంగానికి అభినందనలు. పాయకరావుపేట ఎప్పుడూ కూటమికి కంచుకోటగా ఉంది. అందుకే ఇక్కడి ప్రజల జీవితాలు బాగు చేయడానికి అతిపెద్ద ఇన్వె్‌స్ట్‌మెంట్‌తో స్టీల్‌ సిటీని ఏర్పాటుచేస్తున్నాం. అమరావతికి భూములిచ్చేందుకు అక్కడి రైతులు ముందుకొచ్చారు. అదే స్ఫూర్తితో ఇక్కడి రైతాంగం కూడా ముందుకురావడం అభినందనీయం.

మూడు రీజియన్లుగా అభివృద్ధి..

రాష్ట్రాన్ని విశాఖ, తిరుపతి, అమరావతి కేండ్రాలుగా మూడు ఎనకామిక్‌ రీజియన్లుగా చేసి అభివృద్ధి చేస్తున్నాం. ఏఐ సెంటర్లతో పాటు విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ రాబోతోంది. దేశంలోకి 15 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడం ఇదే తొలిసారి. నెల్లూరులో బీపీసీఎల్‌, అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ, రాయలసీమలో ఏరోస్పేస్‌, రక్షణ, ఎలక్ర్టానిక్స్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనూ రాష్ట్రం సాఽధించబోయే విజయాలు దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌ అవుతాయి.

మీ ప్రాజెక్టు కాదు.. మన ప్రాజెక్టు..

స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. 18 నెలల సమయంలోనే భూమిని సేకరించి అందించాం. అంతే వేగంతో పనులు పూర్తిచేయాలని ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థను కోరుతున్నాను. ఇది మీ ప్రాజెక్టు కాదు. మన ప్రాజెక్టు. ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తిచేయండి. చివరి వరకు సపోర్టు చేస్తాం. అనేక దేశాలు చూశారు. ఏపీ డిఫరెంట్‌. తొలుత నక్కపల్లి.. ఆ తర్వాత అనకాపల్లి జిల్లా.. రాష్ట్రానికి చెందిన యువతకు ఉద్యోగాలు కల్పించాలి.

రాష్ట్రాన్ని పారిశ్రామిక ఆవిష్కరణల హబ్‌గా మారుస్తుంది: ప్రధాని

1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏఎం/ఎన్‌ఎస్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆంధ్ర అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ప్రపంచ శ్రేణి స్టీల్‌ ప్లాంట్‌ అని.. భారత ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తుందని ఆకాంక్షించారు. యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని.. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తుందని సోమవారం ఓ అధికార ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రపంచపటంలో అనకాపల్లికి స్థానం

1.35 లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్‌

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో సాధ్యం: లోకేశ్‌

నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లిలో ఏర్పాటుకానున్న ఏఎం/ఎన్‌ఎస్‌ (ఇండియా) స్టీల్‌ప్లాంటు వల్ల అనకాపల్లి జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పాదయాత్రలో మాటిచ్చానని సభలో చెప్పారు. ఆ హామీ మేరకు ఎన్నో కంపెనీలను రాష్ర్టానికి తీసకొస్తున్నామన్నారు. కేవలం 13 నిమిషాలు జూమ్‌ మీటింగ్‌లో ఆదిత్య మిట్టల్‌తో మాట్లాడి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరగా... ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. 3 నెలల్లోనే వారికి కావాల్సిన భూములను కూడా అప్పగించామన్నారు. 17.8 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేసేందుకు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారన్నారు. డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కారు విధానాలతో ఈ స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.


స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మా ప్లాంటే నిదర్శనం: లక్ష్మీ మిట్టల్‌

నిప్పన్‌ స్టీల్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఏఎం/ఎన్‌ఎస్ -ఇండియా పేరుతో తాము నిర్మించబోయే స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తులను దేశీయ అవసరాలకు వినియోగిస్తూ.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ చైర్మన్‌, ఏఎం/ఎన్‌ఎ్‌స-ఇండియా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌ చెప్పారు. శంకుస్థాపన అనంతరం సభలో ఆయన మాట్లాడారు. ‘ఈ ప్లాంట్‌ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారులకు ఏపీపై ఉన్న నమ్మకానికి ఈ పరిశ్రమ అతిపెద్ద ఉదాహరణ. లక్ష మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’ అని చెప్పారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, అనిత, భరత్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఏఎం/ఎన్‌ఎస్ -ఇండియా సీఈవో ఆదిత్య మిట్టల్‌, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పాల్గొన్నారు.

Untitled-6 copy.jpg

Updated Date - Mar 24 , 2026 | 06:22 AM